మెదక్‌‌ జిల్లాలో ఇద్దరి ప్రాణం తీసిన వివాహేతర సంబంధం

మెదక్‌‌ జిల్లాలో ఇద్దరి ప్రాణం తీసిన వివాహేతర సంబంధం
  • గ్రామస్తులు మందలించడంతో మహిళ సూసైడ్‌‌
  • తననే బాధ్యుడిని చేస్తారన్న భయంతో యువకుడు..
  • మెదక్‌‌ జిల్లా హవేలిఘనపూర్‌‌ మండలంలో ఘటన

మెదక్‌‌ టౌన్, వెలుగు : వివాహేతర సంబంధం విషయం తెలిసి గ్రామస్తులు హెచ్చరించడంతో పురుగుల మందు తాగి ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఇందుకు తననే బాధ్యుడిని చేస్తారన్న భయంతో యువకుడు సైతం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మెదక్‌‌ జిల్లా హవేలిఘనపూర్‌‌ మండలంలో ఆదివారం వెలుగు చూసింది. ఎస్సై సత్యనారాయణ, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... హవేలి ఘనపూర్‌‌ మండలంలోని సుల్తాన్‌‌పూర్‌‌ తండాకు చెందిన సునీత (25)కు పెళ్లై ముగ్గురు పిల్లలు ఉన్నారు.

ఈమెకు కొన్నాళ్ల కింద అదే తండాకు చెందిన నరేశ్‌‌ (26) అనే యువకుడితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో కుల పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టి నరేశ్‌‌కు కు రూ.2.50 లక్షలు జరిమానా విధించడంతో పాటు ఇక మీదట ఇద్దరూ కలుసుకోవద్దని హెచ్చరించారు. అయినప్పటికీ సునీత, నరేశ్‌‌ వివాహేతర సంబంధం కొనసాగిస్తుండడంతో తండావాసులు మరోసారి పంచాయతీ నిర్వహించి హెచ్చరించారు. దీంతో మనస్తాపానికి గురైన సునీత (25) ఈ నెల 2న పురుగుల మందు తాగింది.

అస్వస్థతకు గురైన సునీతను కుటుంబ సభ్యులు సికింద్రాబాద్‌‌ గాంధీ హాస్పిటల్‌‌కు తరలించగా అక్కడ ట్రీట్‌‌మెంట్‌‌ తీసుకుంటూ శనివారం రాత్రి చనిపోయింది. ఈ విషయం తెలుసుకున్న నరేశ్‌‌.. సునీత మృతికి తననే బాధ్యుడిని చేస్తారన్న భయంతో ఆదివారం సాయంత్రం మండల పరిధిలోని లింగ్సాన్‌‌పల్లి తండాకు వెళ్లి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు కేసు నమోదుచేసినట్లు హవేలి ఘనపూర్‌‌ ఎస్సై సత్యనారాయణ తెలిపారు.